కర్ణాటక ఎన్నికల ప్రచారంలో విషాదం.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ కుమార్ గుండెపోటుతో మృతి!

  • జయనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విజయ్ కుమార్
  • ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గుండెపోటు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విషాదం చోటుచేసుకుంది. జయనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎన్ విజయ్ కుమార్ (60) గుండెపోటుతో మృతి చెందారు. బెంగళూరులోని జయనగర్, పట్టాభిరామనగర్ ప్రాంతాల్లో నిన్న నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో విజయ్ కుమార్ కు ఛాతీ నొప్పి రావడంతో ఉన్నపళంగా కుప్పకూలిపోయారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు.

అయితే, చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఈ మేరకు కర్ణాటక బీజేపీ ఓ ట్వీట్ చేసింది. పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని, విజయకుమార్ మృతితో పార్టీకి తీరని నష్టం కలిగిందని ఆ ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. విజయకుమార్ కుటుంబసభ్యులకు కర్ణాటక బీజేపీ ప్రగాఢ సంతాపం తెలిపింది. కాగా, అవివాహితుడైన విజయ్ కుమార్ బీజేపీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.
Go Back to Shorts
Karnataka
bjp mla vijayakumar

More Telugu News